హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పాలీసెట్-2022) ను నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సులకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 365 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
అయితే పరీక్షా కేంద్రాల్లోకి గంట ముందే అభ్యర్థులను అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. పరీక్ష రాసే వారు తప్పకుండా 10 గంటలకే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
-హెచ్బీ బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తప్పకుండా తీసుకు రావాలి.
-హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కాని యెడల.. అలాంటి అభ్యర్థులు తమ వెంట ఒక పాస్పోర్టు సైజ్ ఫోటో, ఐడీ ప్రూఫ్(ఆధార్ కార్డ్) తెచ్చుకోవాలి.
-పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు.
-పరీక్ష రాసే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
ఇంజినీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారు మ్యాథ్స్ 60 మార్కులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ 30 మార్కుల చొప్పున ప్రశ్నలను చేయాల్సి ఉంటుంది. వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీ డిప్లొమా చేయాలనుకునే వారు అదనంగా బయోలాజికల్ సైన్స్లో మరో 30 మార్కుల ప్రశ్నలు చేయాల్సి ఉంటుంది.