సిద్దిపేట, అక్టోబర్ 13: వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఆత్మీయ భరోసా కల్పించేందుకు ఆలన కేంద్రం (పాలియేటివ్ కేర్ సెంటర్)ను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశారు. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో దవాఖానలోని 4వ అంతస్తులో 7 పడ కలతో ఏర్పాటు చేశారు. ఇందులో పక్షవాతం, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలకు గురై మంచానికే పరిమితమైన వారితోపాటు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు సేవలు అందించనున్నారు.
నొప్పుల నుంచి ఉపశమనం పొందడం, గాయాలకు డ్రెస్సింగ్ చేసుకోవడం వంటి అంశాలపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. అత్యవసరమైన వారిని ఈ సెంటర్లో చేర్పించి 2, 3 వారాలపాటు ఉచితంగా వైద్యం, మందులు అందిస్తారు. ఈ కేంద్రం ప్రారంభమైతే ఎంతోమంది పేదలకు ఉపయోగపడ నున్నది. ఈ కేంద్రంలో ఒక పాలిటివ్ కేర్ ఫిజీషియన్తోపాటు ఫిజియోథెరపిస్టు, ఐదుగురు స్టాఫ్ నర్సులు ఉంటారు. మరోవైపు ‘ఆసర’ వాహనంతో ఇంటి వద్దకు వెళ్లి రోగులు, వయో వృద్ధులను పాలియేటివ్ కేర్ సెంటర్కు తీసుకొస్తారు. వైద్యు లు సూచించిన వారికి ఇంటి వద్దనే పిజియోథెరపీ సేవలు అందించనున్నారు. వారంలో 3 రోజులు దవాఖానలో, మరో మూడు రోజులు ఇంటి వద్దే సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్యుల సూచన మేరకు రక్త నమూనాలను సేకరించి టీ-హబ్లో పరీక్షలు కూడా చేస్తారు.