న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గురువారం నుంచి జంతర్మంతర్ వద్ద నిరసనలు చేపట్టనున్నారు. ఓ వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు బుధవారం అనుమతి ఇచ్చారు. నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతులు చేసి, 200 మందికి మించొద్దని.. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నుంచి ఆరుగుకంటే వద్దని షరతు విధించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతామని లిఖితపూర్వకంగా హామీ సైతం తీసుకున్నారు. అలాగే కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఢిల్లీ శివారులోని సింగూ సరిహద్దు నుంచి బస్సుల్లో నిరసన స్థలానికి పోలీసులు రైతులను రప్పించనున్నారు. ఐడీకార్డులు ఉన్న రైతులను మాత్రమే నిరసన స్థలంలోకి అనుమతి ఉంటుందని, సాయంత్రం తిరిగి పోలీసులే రైతులను సింగూ సరిహద్దుకు బస్సుల్లో తరలిస్తారని పేర్కొన్నారు. కొవిడ్ పరిమితుల దృష్ట్యా మార్చ్ నిర్వహించొద్దని, తప్పనిసరిగా సామాజిక దూరం నిబంధనలు పాటించాలని ఆదేశించారు. నిరసన శాంతియుతంగా జరిగేలా విస్తృతమైన ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.