హైదరాబాద్ : ఇటీవల కాలంలో మహిళలపై ఆన్లైన్ వేధింపులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు పలు సూచనలు చేశారు. పోకిరీల విషయంలో మౌనంగా ఉండవద్దని.. అలా ఉండటం వల్ల వాళ్లు మరింత రెచ్చిపోతారని హెచ్చరించారు. ఎవరైనా వేధిస్తుంటే ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని.. వాళ్ల బెదిరింపులకు భయపడొద్దని సూచించారు. అంతేకాకుండా ఆన్లైన్లో ఎవరైనా వేధింపులకు పాల్పడినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదనే దానిపై పలు సూచనలు చేశారు.
☞ మిమ్మల్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తుంటే వెంటనే మీ ఇంట్లో పెద్దలకు, మీకు సన్నిహితంగా ఉండేవారితో విషయాన్ని పంచుకోండి. ఎలాంటి ఆందోళనలు వద్దు.
☞ మీకు పంపే మెసేజ్లు, ఇతర అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలను స్క్రీన్షాట్ తీసుకుని సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి తర్వాత ఆధారాలుగా పనికివస్తాయి.
☞ మీకు అసభ్యకరమైన మెసేజ్లు పంపే వారిని వెంటనే అన్ఫ్రెండ్ లేదా బ్లాక్ చేయాలి.
☞ మీ స్నేహితులకు సంబంధించి కూడా ఇలాంటి విషయాలు తెలిస్తే వెంటనే వారి పెద్దల దృష్టికి తీసుకెళ్లండి. మౌనంగా ఉండవద్దు.
☞ అడ్డగోలు మెసేజ్లు, అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పెట్టేవారికి ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వవద్దు. వాటిని పట్టించుకోకపోవడం మంచిది.
☞ అవతలి వ్యక్తులకు సమాధానం ఇస్తూ వెళ్తే వాళ్లు మరింత రెచ్చిపోతారు.
☞ మిమ్మల్ని బెదిరిస్తూ మెసేజ్లు పెట్టినా, ఫోన్కాల్స్ చేసి బెదిరించినా సమాధానం ఇవ్వవద్దు.
☞ ఇతరులు వేధించడాన్ని మీ తప్పుగా తీసుకుని మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు.