నిజామాబాద్ క్రైం, ఆగస్టు 7: జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్షకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీపీ నాగరాజు ఆదేశాల మేరకు అని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలుచేయడంతో పాటు కేంద్రాల పరిసర ప్రాంతాలకు అభ్యర్థులను మాత్రమే అనుమతించారు. మొత్తం 6,684 మంది అభ్యర్థులకు గాను 6,156 మంది హాజరుకాగా.. 528 మంది గైర్హాజరయ్యారు. జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ పి.రామ్మోహన్రావు, నోడల్ ఆఫీసర్ నరేందర్రెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ పరీక్షలను డీసీపీ వి.అరవింద్బాబు పర్యవేక్షించారు. నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ప్రభాకర్రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పరీక్ష విధుల్లో పాల్గొన్నారు.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు..
ఇతర ప్రాంతాల నుంచి నిజామాబాద్లోని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థుల కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటుచేశారు. వన్టౌన్ ఎస్హెచ్వో ఆధ్వర్యంలో డి.విజయ్బాబు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రధాన బస్టాండ్లో ర్యూట్ మ్యాప్, హెల్ప్ డెస్క్ను ఏర్పాటుచేసి అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లే మార్గాన్ని వివరించారు. అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ చెబుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీపీ నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
కామారెడ్డి జిల్లాలో..
విద్యానగర్, ఆగస్టు 7: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కోసం ఐదు సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 2,889 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 2,719 మంది హాజరై, 170 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 94.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రానికి ఒక అభ్యర్థి ఆలస్యంగా రావడంతో అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు. సాందీపని డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, పోలీసు నోడల్ అధికారి, అదనపు ఎస్పీ అన్యోన్య తనిఖీ చేశారు. డీఎస్సీ సోమనాథం ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలతో సహా 103 మంది పోలీ సు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ శంకర్, పోలీసు అదనపు నోడల్ అధికారి సునీల్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సుభాష్, నరేశ్కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.