నల్లగొండ : కుటుంబ తగాదాలతో ఆత్మహత్యకు యత్నించిన తల్లీ కూతురును నల్లగొండ టూటౌన్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టూ టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న గుర్రం గాయత్రి ఇంట్లో కుటుంబ తగాదాలతో కూతురు శ్రీజను వెంట తీసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. వెంటనే ఆమె తమ్ముడు శివ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన నల్లగొండ టూ టౌన్ పెట్రో కార్ సిబ్బంది సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆమె లతీఫ్ సాహెబ్ గుట్టపైన ఉన్నట్లుగా గుర్తించారు.
గుట్టపైకి చేరుకొని ఆమెకు నచ్చజెప్పి కిందకు తీసుకువచ్చి, కుటుంబీకులకు అప్పగించారు. పెట్రోకార్ సిబ్బంది వేగంగా స్పందించడంతో తల్లీబిడ్డలు దక్కాయి. ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ రంగనాథ్, అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ ఐ నర్సింహా పెట్రో కార్ సిబ్బందిని అభినందించారు. సమాచారం వచ్చిన వెంటనే గాయత్రి, శ్రీజలను రక్షించిన పోలీసులకు ఆమె కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.