ఖైరతాబాద్, జూన్ 5: రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ నిండు నూరేండ్లు వర్ధిల్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆదివారం ఖైరతాబాద్లోని వాసవి సేవా కేంద్రంలో కోలేటి దామోదర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎల్ రమణ, తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా అవకాశం కల్పించారని చెప్పారు.
ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్యభవన్ కోసం స్థలం, నిధులు కేటాయించారని అన్నారు. కోలేటి దామోదర్ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకొన్న తర్వాత రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల ఆధునీకరణకు పాటుపడ్డారని తెలిపారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నదని, అందుకు కోలేటి దామోదర్ విశేష కృషి చేశారని అన్నారు. దామోదర్ మాట్లాడుతూ తనకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మొదలుకొని గవర్నర్ రోశయ్య వరకు చాలామంది పెద్దలతో పరిచయం ఏర్పడిందని, సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ పదవి అప్పజెప్పారని వెల్లడించారు. కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు ఆలంపల్లి రవి కుమార్, కొండ్లె మల్లికార్జున్, వెంపటి మధు తదితరులు పాల్గొన్నారు.