పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో మాయమైన బంగారం లభించింది. నిన్న తెల్లవారుజామున మల్యాలపల్లిలో రాజీవ్ రహదారి మూలమలుపు వద్ద కారు బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు రాంబాబు, శ్రీనివాస్ మరణించారు. అయితే మృతుల వద్ద నిన్న 3.300 కిలోల బంగారం లభించినట్లు పోలీసులు ప్రకటించారు. మరో 2.30 కిలోల బంగారం మాయమైందని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. 24 గంటల్లోగా కేసును ఛేదించారు. ఇవాళ మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు హాజరుపరుచనున్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు కొత్త రాంబాబు (55), కొత్త శ్రీనివాస్ (45), జీ సంతోష్కుమార్.. ఫిబ్రవరి 22న (సోమవారం) నరసరావుపేటలోని శ్రీనివాస జ్యువెల్లర్స్ నుంచి బంగారు ఆభరణాలను తీసుకొని మంచిర్యాల, బెల్లంపల్లి, నిజామాబాద్, బోధన్, బాన్సువాడలో విక్రయించేందుకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు మంగళవారం ఉదయం 5.30 గంటలకు మల్యాలపల్లి అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. దీంతో కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతిచెందగా, కొత్త శ్రీనివాస్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. గాయపడిన జీ సంతోష్బాబు, డ్రైవర్ సంతోష్ను కరీంనగర్లోని దవాఖానకు తరలించారు. డ్రైవర్ సంతోష్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
108 అంబులెన్స్ సిబ్బంది నిజాయితీ..
కాగా, రోడ్డు ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది అబ్దుల్ చాంద్, తూట రాజేందర్కు కారులో బంగారు ఆభరణాలు కనబడ్డాయి. వెంటనే వాటిని రామగుండం ఎస్ఐ మామిడి శైలజకు అందజేసి, నిజాయితీ చాటుకున్నారు. కాగా, ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.