హైదరాబాద్ : సంతోష్నగర్ యువతి గ్యాంగ్ రేప్ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. యువతిపై అత్యాచారం జరగలేదని, తనను కాదని మరో వివాహం చేసుకుంటున్న బాయ్ఫ్రెండ్ని కేసులో ఇరికించేందుకు నాటకం ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఫిసల్బండకు చెందిన ఓ యువతి సంతోష్నగర్లో లాబ్ టెక్నీషియన్గా పని చేస్తోంది. ఈ నెల 17న రాత్రి 9.30గంటలకు బదులు 10.30గంటలకు యువతి ఇంటికి వెళ్లింది. గంట ఆలస్యంగా రావడంతో కుమార్తెను తల్లిదండ్రులను ప్రశ్నించడంతో తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో యువతి కలిసి తల్లిదండ్రులు బుధవారం సంతోష్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కేసును సవాల్గా తీసుకున్న సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యాదగిరి థియేటర్ నుంచి పహాడీషరీఫ్ వరకు రోడ్లపై ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. అందులో వారికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బాధితురాలి ఫిర్యాదుకు, సీన్ ఆఫ్ అఫెన్స్కు ఎక్కడా పొంతన కుదరకపోవడం.. యువతి ఇంటి నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ రెండు కిలోమీటర్లు కూడా లేకపోవడంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినా దర్యాప్తులో ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా విచారణ కొనసాగించారు. బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి ప్రధాన రహదారి, అనుసంధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాలకు దారితీసే చోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు.
వాటిల్లో కనిపించిన ఆటోలు ఏ మార్గం నుంచి వెళ్లాయో ఆరా తీశారు. సంతోష్నగర్ నుంచి మైలార్దేవ్పల్లి, పహాడీషరీఫ్ ప్రాంతాల్లో సెల్ టవర్ సిగ్నల్స్ను విశ్లేషించారు. చాలా మంది ఆటో డ్రైవర్లనూ విచారించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు యువతిని పలు కోణాల్లో విచారించారు. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన వ్యక్తికి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడని, ఆ కక్షతోనే అతడిని కేసులో ఇరికించేందుకు నాటకమాడినట్లు అసలు విషయాన్ని బయటపెట్టింది. మరో వైపు వైద్య పరీక్షల్లో యువతిపై అత్యాచారం జరుగలేదని తేలిందని సమాచారం.