హైదరాబాద్ : మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది ఆ కంపెనీ. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. అనంతరం టెలిఫోన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆన్లైన్లోనే ఆఫర్ లెటర్లు జారీ చేసింది. శిక్షణ అనంతరం మోసం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. డన్యోన్ ఐటీ టెక్నాలజీ కంపెనీ కొద్ది రోజుల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన జారీ చేసింది. ఉద్యోగాల కోసం సంప్రదించిన వంద మంది పైబడి ఉద్యోగుల నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల చొప్పున వసూలు చేసింది. ఇక టెలిఫోన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించింది. అర్హులైన వారికి ఆఫర్ లెటర్లు జారీ చేసింది. ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇచ్చింది. త్వరలోనే ప్రాజెక్టు ఇస్తామంటూ ఆ కంపెనీ ప్రతినిధులు నమ్మబలికారు. ఒక్కో ఉద్యోగికి రూ. 4 లక్షలు ప్యాకేజీ ప్రకటించారు. అయితే ప్రాజెక్టు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో.. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డన్యోన్ ఐటీ టెక్నాలజీ కంపెనీ యజమాని ప్రతాప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.