కుత్బుల్లాపూర్, ఆగస్టు 1: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఎ.బాబు(40) తన కొడుకు అశోక్(25) మేడ్చల్ గుండ్ల పోచంపల్లి అయోధ్యనగర్లో ఉంటుండగా, బాబురావు ఇటీవలె తన కొడుకు ఇంటికి వచ్చాడు. ఆదివారం రాత్రి సమయంలో బాబురావు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.
తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆరా తీశారు. కాగా, సోమవారం తెల్లవారుజామున గుండ్ల పోచంపల్లిలోని మల్లన్న గుడి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికుల కంటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ రామలింగరాజు, సీఐ ప్రశాంత్లతో పాటు క్లూస్ టీంను రంగంలోకి దిగి పరిశీలించారు. మృతుడు బాబుగా గుర్తించారు. మృతుడి పొత్తి కడుపు, మెడ భాగంలో మద్యం సీసాతో పొడిచి చంపిన అనంతరం, తలపై బండరాయితో మోదినట్లు తేలింది. ప్రాథమికంగా మృతుడి కుమారుడు అశోక్పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.