సిటీబ్యూరో, జనవరి 22(నమస్తే తెలంగాణ): దేవాలయాలు, బ్యాంక్లలో చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను శనివారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి దాదాపు రూ.20 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మెట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు.
ఏపీ రాష్ట్రం గుంటూరుకు చెందిన పొన్నూరి చిన్న సత్యానందం, గండం సమ్మయ్య, జంగాల ప్రసాద్, మండల నాగేందర్, నల్గొండ జిల్లాకు చెందిన ధరావత్ నవీన్లు వివిధ కేసుల్లో జైలుకు వెళ్లినప్పుడు పరిచయమయ్యారు. వీరంతా జైల్లోనే ముఠాగా ఏర్పడ్డారు. స్వల్పకాలంలోనే కోటీశ్వరులు కావాలని పథకం వేశారు. జైలు నుంచి బయటకు రాగానే బ్యాంకులు, దేవాలయాల్లో చోరీలు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు.
దొంగిలించిన వాహనంలోనే..
ముఠా సభ్యులు చోరీకి బయలుదేరే ముందు వారికి అనుకూలంగా ఉండే వాహనాన్ని దొంగతనం చేస్తారు. దానికి ఏపీలోని హై-సెక్యూరిటీ నంబర్ ప్లేట్ను పెట్టుకుంటారు. అదే వాహనంలో రెక్కీ నిర్వహించి.. దొంగతనం చేసి అందులోనే పారిపోతారు. టోల్ ప్లాజాలు ఉండే మార్గాల్లో ప్రయాణించరు. సంతోషిమాత దేవాలయంలో చోరీకి పాల్పడిన సమయంలో గుంటూరులో కారు దొంగతనం చేసి రాజమండ్రికి చెందిన ఓ ఉద్యోగి కారు నంబర్ను పెట్టుకుని వచ్చి దొంగతనం చేశారు. ఇలా ఈ ముఠా ఇప్పటివరకు 10 చోరీలకు పాల్పడగా.. అందులో 4 దేవాలయాలు, ఓ బ్యాంక్, 2 ఇండ్లలో దొంగతనాలు చేశారు. మూడు వాహనాలను అపహరించారు. ఈ ముఠాను పట్టుకున్న సిబ్బందికి సీపీ నగదు రివార్డులను అందించారు. సమావేశంలో జాయింట్ సీపీ సుధీర్బాబు, ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, క్రైం డీసీపీ యాదగిరి, అదనపు డీసీపీ శ్రీనివాసులు, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ సంతోషిమాత దేవాలయంలో..
ఈ ముఠాకు గ్యాంగ్ లీడర్గా పొన్నూరి చిన్న సత్యానందం వ్యవహరిస్తున్నాడు. జనవరి 3న రాత్రి ఎల్బీనగర్ సంతోషిమాత దేవాలయంలోకి ప్రవేశించి దాదాపు 21.5 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. చోరీ జరిగిన రోజు ఉదయం దేవాలయంలోకి వచ్చి రెక్కీ నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పొన్నూరి చిన్న సత్యానందం, ధరావత్ నవీన్, గండం సమ్మయ్య, జంగల ప్రసాద్ను అరెస్టు చేయగా మండ్ల నాగేందర్ పరారీలో ఉన్నాడు.