అమరావతి : పేకాటరాయుళ్లను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఎదురుదాడి చేసి ఎస్సైను గాయపరిచిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం ఉల్లిపాయ జట్టుకు చెందిన సుమారు 50 మంది కార్మికులు వేడుకలో పాల్గొని ముత్యాలమ్మ గుడి వద్ద పేకాటాడుతున్నారు. సమాచారం తెలుసుకున్నా తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై శ్రీనివాసరావు మఫ్టీలో సంఘటన స్థలానికి చేరుకుని పేకాటాడుతున్న స్థావరంపై దాడి చేశారు. నగదును స్వాధీనం చేసుకుంటున్న సమయంలో రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు దొంగా..దొంగా అంటూ రెచ్చిపోయి ఎస్సైతో పాటు అక్కడికి వచ్చిన కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపర్చారు.
తాను ఎస్సైను అని చెబుతున్నా వినకుండా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. వీరిలో కొంతమంది మద్యం సేవించి ఉన్నారు. విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పోలీసులపై దాడి చేయడాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు 24 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ద్విచక్రవాహనాలు, సెల్ ఫోన్లు, రూ. 74 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.