న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, దేశానికి సంబంధించి కొవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పౌల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఆఫ్రికా దక్షిణ దేశాల్లో కరోనా న్యూ స్ట్రెయిన్ B.1.1.529 విస్తృతి నేపథ్యంలో ప్రధాని ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ న్యూ స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా వ్యాపిస్తున్నది. ఈ వేరియంట్లో మొత్తం 50 రకాల ఉత్పరివర్తనాలు ఉన్నాయి. దాని కొమ్ము ప్రాంతంలోనే 30 రకాల ఉత్పరివర్తనాలు ఉన్నాయి. అందుకే ఈ కొత్త రకం వేరియంట్ అతివేగంగా విస్తరిస్తున్నది. వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావం చూపుతున్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన బాధితుల్లో లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటున్నాయట. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అనే పేరు పెట్టింది.
ఈ ఒమిక్రాన్ను ముందుగా ఈ వారం మొదట్లో ఆఫ్రికా దక్షిణ దేశాల్లో బయటపడింది. ఆ తర్వాత బోట్స్వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియం దేశాలకు కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రమాదకర వైరస్ దేశంలోకి రాకుండా అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.