రాంచీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కరోనా మహమ్మారి పరిస్థితిపై చర్చించారు. ఈ చర్చలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ రోజు గౌరవనీయ ప్రధాని ఫోన్ చేశారు. ఆయన తన మన్ కీ బాత్ (మనసులోని మాట) చెప్పారు. కానీ ఆయన వ్యవహారంపై మాట్లాడి.. మేం చెప్పేదేమిటో వింటే బాగుండేది అని సోరేన్ కామెంట్ చేశారు. తన ఆందోళన ఏమిటో చెప్పేందుకు ప్రధాని అనుమతించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని తాను మాత్రమే మాట్లాడారని, ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వలేదని అన్నారు. ఈ సంగతి ఆయన ట్విట్టర్ లో కూడా పెట్టారు. దీనిపై సహజంగానే కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని పనితీరును ఖండించింది. ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లోనూ ప్రధాని తాను మాట్లాడి ఇతరులు చెప్పేది వినకపోవడం దురృష్టకరమని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా దుయ్యబట్టారు. కాగా బీజేపీ నేతలు మాత్రం సోరేన్పై నిప్పులు చెరిగారు. ఆయన సీఎం పదవి పరువు తీశారని, తన వైపల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటి చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని అసోం బీజేపీ నేత హిమంత బిస్వాల్, జార్ఖండ్ బీజేపీ నేత బాబూలాల్ మరాండి తదితరులు దుమ్మెత్తిపోశారు.