ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చే నాటికి మోదీ సాధువు అవతారం ఎత్తుతారంటూ ఫైర్ అయ్యారు. ఓ వైపు దేశంలో హిందూ ధర్మం క్షీణిస్తోందని, అయినా ఎన్నికల్లో ఓట్ల కోసం మోదీ సాధువు అవతారం ఎత్తుతున్నారని విమర్శించారు. మైనారిటీల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని, చరిత్ర, సత్యాలకు కూడా వక్రభాష్యాలు చెబుతోందంటూ మంఇపడ్డారు.
మోదీ ప్రభుత్వం ప్రతి దాన్నీ ధ్వంసం చేస్తోందని, చరిత్రను కూడా మార్చుతోందని ఆమె ఆరోపించారు. బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలోని అమరజవాన్ జ్యోతిని తీసేసి, నేతాజీ హోలోగ్రామ్ను ఏర్పర్చారని, ఇప్పుడు హోలోగ్రామ్ కూడా పోతోందని మమత ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనే బీజేపీ వారికి స్వాతంత్ర సమరయోధులు గుర్తుకు వస్తారని మమతా ఎద్దేవా చేశారు.