న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల సంబంధాల బలోపేతం కోసం పదేళ్ల రోడ్మ్యాప్ను విడుదల చేయనున్నారు. బహుముఖ వ్యూహాత్మక సంబంధాలను పెంచేందుకు ఈ సదస్సు ఓ ముఖ్యమైన అవకాశంగా నిలుస్తుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పరస్పర అవగాహన ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సహకారం కోసం ఈ భేటీ ఉపయోగపడుతుందని పేర్కొంది. భేటీలో ముఖ్యంగా ప్రజా సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, వాతావరణ సమస్యలు, వైద్య రంగాలపై చర్చించనున్నట్లు తెలిపింది.
భారత్, బ్రిటన్ మధ్య 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాజా సదస్సు ఓ ముఖ్యమైన అవకాశమని పేర్కొంది. శిఖరాగ్ర సమావేశంలో కరోనా కట్టడిలో సహకారంపైనా ఇరువురు దేశాధినేతలు చర్చిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం లండన్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు జరిగే సమావేశానికి భారత్ను అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.