న్యూఢిల్లీ : భారత స్ప్రింట్ లెజెండ్ మిల్కాసింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆరా తీశారు. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న అథ్లెట్లను ఆశీర్వదించేందుకు, ప్రేరణ అందించేందుకు మిల్కా సింగ్ పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా త్వరలోనే తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో 91 సంవత్సరాల దిగ్గజ స్ప్రింటర్ చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఆర్) ఆసుపత్రికి తరలించారు.
ఆయన మే 20న కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం మొదట మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకోగా.. గత ఆదివారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో గురువారం రాత్రి చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూకు తరలించి, చికిత్స అందిస్తుండగా.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్ సైతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.