అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడలకు తెరలేచింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో పటాకుల వెలుగు, జిలుగుల మధ్య 36వ నేషనల్ గేమ్స్ గురువారం అట్టహాసంగా మొదలయ్యాయి. స్టార్ స్విమ్మర్ మనా పటేల్ నుంచి టార్చ్ అందుకున్న ప్రధాని మోదీ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన పీవీ సింధు, నీరజ్ చోప్రా, మీరాబాయిచాను, రవి దహియా, మాజీ షూటర్ గగన్నారంగ్, హాకీ ఇండియా(హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గుజరాత్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ కళాకారులు ప్రదర్శించిన నృత్యరీతులు, కళారూపాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఏడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న జాతీయ గేమ్స్లో దేశంలోని అన్ని రాష్ర్టాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు ఏడు వేల మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. మార్చ్ఫాస్ట్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ సారథ్యం వహించారు. ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి జగదీశ్వర్యాదవ్ పాల్గొన్నారు.