న్యూఢిల్లీ: ఈ నెల చివర్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది దేశాధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మోదీకి ఇది తొలి పర్యటన కానున్నది. ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్లో మోదీ పర్యటిస్తారు. సెప్టెంబర్ 22 నుంచి 27 మధ్య ఆ టూర్ ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోదీ ప్రత్యేకంగా భేటీకానున్నారు. అయితే ఆ ఇద్దరూ ఇప్పటికే మూడు సార్లు వర్చువల్గా కలిశారు. మార్చిలో క్వాడ్ మీటింగ్, ఏప్రిల్లో వాతావరణ మార్పులు, జూన్లో జరిగిన జీ-7 సదస్సులో వాళ్లు కలుసుకున్నారు.
ప్రధాని మోదీ 2019 సెప్టెంబర్లో అమెరికా వెళ్లారు. అప్పుడు ఆయన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను కలిశారు. హౌడీ మోడీ ఈవెంట్లోనూ ఆయన పాల్గొన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల రాజ్యం ఏర్పడిన నేపథ్యంలో.. బైడెన్తో మోదీ భేటీ కీలకం కానున్నది. బైడెన్ ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులతోనూ మోదీ చర్చిస్తారు. చైనా, ఇండో పసిఫిక్ అంశాల గురించి మాట్లాడనున్నారు.