న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు. కొవిడ్ వ్యాప్తి అనంతరం విదేశీ పర్యటన చేయడం తొలిసారి. ఉదయం 7.45 గంటలకు బంగ్లాకు బయలుదేరి 10గంటలకు ఢాకా చేరుకుంటారు. 10.50గంటలకు జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి, నివాళులర్పించనున్నారు. అనంతరం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత 3:45 గంటలకు జాతీయ దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రాత్రి 7:45 గంటలకు బాపు – బంగబందు డిజిటల్ వీడియో ఎగ్జిబిషన్ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్లో బంగ్లా ప్రధానితో వీడియో సమావేశం ఫలవంతంగా జరగ్గా.. తాజా పర్యటనలో మరింత అర్ధవంతమైన చర్చలుంటాయని భావిస్తున్నారు. ప్రధాని షేక్ హసీనా, బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్తో పాటు ఇతర బంగ్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
బంగ్లాదేశ్ యాభై ఏళ్ల క్రితం పాకిస్థాన్ నుంచి విడివడి స్వతంత్ర దేశంగా అవతరించేందుకు భారత్ అన్ని రకాలుగా సహాయపడింది. ఈ మేరకు బంగ్లా స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిధిగా పాల్గొనాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ దేశ ప్రధాని ఆహ్వానించడంతో ఇందుకు సమ్మించారు. భారతదేశం 1971 డిసెంబర్ ఆరో తేదీన బంగ్లాదేశ్ను సార్వభౌమ దేశంగా గుర్తించింది. ఈ క్రమంలో శుక్ర, శనివారాల్లో మోదీ ఢాకాలో బంగ్లా స్వాతంత్య్ర స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొంటారు. దాంతోపాటు బంగ్లాదేశ్ జాతిపిత, బంగ బంధు షేక్ ముజిబుర్ రహమాన్ శత జయంత్యుత్సవంలోనూ నరేంద్ర మోదీ హాజరవనున్నారు. ఇటీవల ముజిబుర్ రహమాన్కు భారత్ గాంధీ శాంతి పురస్కారం (2020) ప్రకటించింది. మోదీ పర్యటనలో రెండు దేశాలు బంగబంధు-బాపూ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 1971 బంగ్లా విమోచన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించి ఘనంగా నివాళులు సమర్పిస్తారు. బంగ బంధు మ్యూజియాన్ని సందర్శిస్తారు. ప్రత్యేక సైనిక కవాతులను వీక్షిస్తారు. భారత ప్రధాని మోదీ టుంగిపారాలో బంగబంధు ముజిబ్ స్వగృహాన్ని సందర్శించి అంజలి ఘటిస్తారు. అలాగే పశ్చిమ బంగ్లాకు సరిహద్దుకు సమీపంలో ఉన్న జెసోరేశ్వరియా కాళీ ఆలయంతో పాటు మరో ఆలయంలో పూజలు చేయనున్నారు.