అమరావతి : గులాబ్ తుఫాను పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మాట్లాడారు. కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారిన విషయం తెలిసిందే. ఏపీలోని గోపాల్పూర్కు 140, కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో తుపాను పశ్చిమ దిశగా కదులుతున్నది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం ఇవాళ అర్ధరాత్రి దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఈ సమయంలో గంటకు 70-90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇప్పటికే ఒడిశా, ఉత్తరాంధ్రకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తుఫాను అనంతరం పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.