న్యూఢిల్లీ: త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్య్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్య్రాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని చెప్పారు. గాంధీజీ, చంద్రబోస్, అంబేద్కర్ వంటివారు మార్గదర్శకులని వెల్లడించారు. మంగళ్పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు.
76వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతున్నదని చెప్పారు. అమృత మహోత్సవాల వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు. అమృత మహోత్సవాల వేళ కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
‘మహనీయుల తీరుగుబాట్లు మనకు స్ఫూర్తి. అల్లూరి, గురు గోవింద్ వంటివారి తిరుగుబాట్లు మనకు ఆదర్శం. త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగింది. ఇది దేశ నలుమూలలా ఎందరో వీరులను స్మరించుకునే రోజు. జీవితాలనే త్యాగం చేసినవారి ప్రేరణతో నవ్వదిశలో పయనించాలి. మన ముందున్న మార్గం కఠినమైనది. ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. 75 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. వందల ఏండ్ల బానిసత్వంలో భారతీయతకు భంగం కలిగింది. బానిసత్వంలో భారతీయత భావన గాయపడింది’ అని ప్రధాని మోదీ అన్నారు.