న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సానుకూల ఫలితాలే 2024లోనూ పునరావృతమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంకేతాలని ఆయన అభివర్ణించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ యూపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తాజా ఫలితాలతో రుజువైందని పేర్కొన్నారు.
బీజేపీ పాలనపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగిందని చెప్పారు. స్త్రీశక్తి తమకు అండగా ఉందని కొత్తగా ఓటు హక్కు పొందిన యువత తమకు పట్టం కట్టారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్లో తమకు స్ధానాలు పెరిగాయని, గోవాలో అందరి అంచనాలు తారుమారయ్యాయని చెప్పుకొచ్చారు.
యూపీలో రెండోసారి పట్టం కట్టి రికార్డు సృష్టించారని అన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ సహా అన్ని ధరలూ మండుతుండగా యుద్ధం కారణంగా ధరలు పెరుగుతున్నాయని ధరల మోతను మోదీ సమర్ధించుకున్నారు.