ఢిల్లీ ,జూన్ 4: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ… కరోనా మహమ్మారి ఈ శతాబ్దంలో అతి పెద్ద సవాలు గా నిలిచిందన్నారు. గతంలో మానవాళి కి ఒక భారీ సవాలు ఎదురైనపుడల్లా విజ్ఞాన శాస్త్రం ఓ మెరుగైన దారిని చూపించిందని ఆయన అన్నారు. పరిష్కారాలను కనుగొనడం ద్వారా కొత్త బలాన్ని పుంజుకోవడమనేది విజ్ఞానశాస్త్రం ద్వారానే సాధ్యమైందని ఆయన అన్నారు.
ప్రపంచ వ్యాప్త వ్యాధి బారి నుంచి మానవ జాతిని రక్షించడం కోసం టీకా మందులను ఒక సంవత్సరం లోపే శరవేగం గా, పెద్ద ఎత్తు న తయారు చేసినందుకు శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి ప్రసంశించారు. కిందటి శతాబ్దం లో నూతన ఆవిష్కరణ లు ఇతర దేశాల లో చోటు చేసుకొన్నాయి, భారతదేశం చాలా సంవత్సరాల పాటు వేచివుండవలసి వచ్చిందని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం మన దేశం లోని శాస్త్రవేత్తలు వేగంగా, ఇతర దేశాలతో సమానం గాను శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా కు వ్యతిరేకం గా సాగుతున్నటువంటి పోరు లో కోవిడ్-19 టీకా మందుల విషయంలో, టెస్టింగ్ కిట్స్ విషయంలో, అవసరమైన సామగ్రి విషయంలో, సరికొత్త ఔషధాల విషయంలో భారతదేశాన్ని సొంత కాళ్ల మీద నిలబడేటట్టు చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ ప్రశంసించారు.