ప్రస్తుతం వివిధ రోగాల కోసం వాడే ఔషధాలు ఖరీదైపోయాయని, దాంతో తక్కువ ధరలకే ఔషధాలను అందించే పీఎం జన ఔషధి కేంద్రాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. జన ఔషధి దివస్ను పురస్కరించుకుని ప్రధాని ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షిల్లాంగ్లో 7,500వ జన ఔషధీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రజలంతా అగ్గువకే ఔషధాలను అందించే మోదీకీ దుకాణ్ల (జన ఔషధీ కేంద్రాలు) ద్వారా అవసరమైన ఔషధాలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అల్పాదాయ వర్గాల కోసం ఇప్పుడ దేశమంతటా పీఎం జన ఔషధీ పరియోజనా పథకం అందుబాటులోకి వచ్చిందని, ఈ పథకం ద్వారా సేవ, ఉపాధి అనే రెండు లక్ష్యాలు నెరవేరుతున్నాయని ప్రధాని చెప్పారు. జన ఔషధీ కేంద్రాల ద్వారా దేశంలోని ఎంతో మంది యువతకు ఉపాధి లభించిందన్నారు. జన ఔషధీ కేంద్రాల్లో బాలికలకు రూ.2.5 ఒకటి చొప్పున శానిటరీ ప్యాడ్స్ లభిస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 11 కోట్ల శానిటరీ నాప్కిన్స్ అమ్ముడుపోయాయని తెలిపారు. మొత్తం జన ఔషధీ కేంద్రాల్లో 1000 కేంద్రాలను మహిళలే నిర్వహిస్తున్నారన్నారు.
ప్రస్తుతం మనం మన అవసరాలతోపాటు, ప్రపంచ అవసరాలు తీర్చేస్థాయిలో దేశీయంగా కొవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.250కి డోస్ చొప్పున వ్యాక్సిన్ అందిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. తాను ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నానని ఆయన చెప్పారు.