న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఘటనపై యూపీ సీఎం యోగి విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని బారాబంకి డీఎంను ఆదేశించారు. మిగతా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాటు చేయాలని సూచించినట్లు యూపీ అదనపు హోంశాఖ కార్యదర్శి తెలిపారు. బారాబంకీ మృతులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లక్నో – అయోధ్య రహదారిపై హర్యానా నుంచి బిహార్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సును రామ్ స్నేహి ఘాట్ సమీపంలో ట్రక్టు ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారని లక్నో జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ్ సబత్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండగా.. బస్సుకు డ్రైవర్ మరమ్మతులు చేస్తుండగా.. ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. ఈ క్రమంలోనే లక్నో వైపు నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టిందని ఏడీజీ చెప్పారు.