పంజాబ్ అధికారులతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కావడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో కేజ్రీవాల్ పంజాబ్ విద్యుత్ అధికారులతో సమావేశమయ్యారు. దీనిపై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో విరుచుకుపడ్డాయి. రిమోట్ కంట్రోల్ కేజ్రీవాల్ అంటూ ఫైర్ అయ్యాయి. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తాజాగా స్పందించారు. తానే అధికారులను సీఎం కేజ్రీవాల్ వద్దకు పంపానని వివరణ ఇచ్చుకున్నారు. ట్రైనింగ్ విషయంలోనే తాను అధికారులను కేజ్రీవాల్ వద్దకు పంపామని తెలిపారు. అధికారులకు శిక్షణ అవసరమైతే ఎక్కడికైనా పంపాలి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు ఇజ్రాయిల్కు కూడా పంపిస్తాను.విద్యుత్ రంగం, విద్యారంగంలో ఢిల్లీ మంచి రికార్డులు సాధించింది. అందుకే పంపాను. దీనికి అభ్యంతరం ఎందుకు? అంటూ సీఎం భగవంత్ మాన్ ప్రశ్నించారు.
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. పంజాబ్ విద్యుత్ అధికారులతో సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో ఈ సమావేశం జరిగింది. దీంతో కేజ్రీవాల్పై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో విరుచుకుపడ్డాయి. ఆయన ఓ రిమోట్ కంట్రోల్ అంటూ విరుచుకుపడ్డాయి. ఈ విషయంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు సిద్దూ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో సీఎం కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. దీనిని బట్టి అరవింద్ డీఫ్యాక్టో సీఎం అని తేలిపోయింది. ఢిల్లీ రిమోట్ కంట్రోల్ అని స్పష్టమైపోయింది. ఫెడరలిజాన్ని కేజ్రీవాల్ అవమానించారు. అటు సీఎం, ఇటు కేజ్రీవాల్ ఇద్దరూ దీనిపై వివరణ ఇవ్వాలి అని పీసీసీ మాజీ చీఫ్ సిద్దూ డిమాండ్ చేశారు.