వికారాబాద్ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టును బీజేపీనే అడ్డుకుంటోందని, 100 దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోకుండా ప్రధాన మంత్రే తెలంగాణకు శత్రువుగా మారాడని ఆరోపించారు. ‘‘ఇక్కడున్న బీజేపీ నేతలకు దమ్ముంటే.. ఢిల్లీ పోయి కేంద్ర ప్రభుత్వం దద్దమ్మతనం వల్ల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. అందువల్ల వికారాబాద్ జిల్లాకు నీరు అందడం లేదని అడగాలి.
అంతేకానీ కేసీఆర్ బస్సు ముందు జెండాలు పట్టుకొని ఊపడం కాదు. అక్కడకెళ్తే నోళ్లు రావు. లాగులు తడిచిపోతాయి. మీ ప్రధాని మాత్రం కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, 8 ఏళ్లుగా దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినా తేల్చలేదు. మేం కరువులో ఉన్నాం ఎన్ని నీళ్లు ఇస్తారో చెప్తే అలా ప్రాజెక్టు కట్టుకుంటామని చెప్పాం. కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెట్టి ప్రధాన మంత్రే మనకు శత్రువయ్యాడు.
కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వం వల్లనే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. అయినా మేం ప్రాజెక్టు కడుతుంటే.. ఈ పార్టీ వాళ్లే రకరకాల కిరికిరులు చేసి, కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టు ఆపుతున్నారు. అయినా భయం అక్కర్లేదు. ప్రాజెక్టు ఎలాగైనా పూర్తిచేసి నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొస్తానని మాటిస్తున్నా. ఇక్కడి పొలాల్లో కృష్ణానది నీళ్లు పారించి చూపిస్తా’’ అని హామీ ఇచ్చారు.