క్రీడాకారులకు నిలయం తెలంగాణ
పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్
ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్లు
మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్గౌడ్
బడంగ్పేట,జూన్ 2 : క్రీడారంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్ అన్నారు. బడంగ్పేట మున్సిపల్ గ్రౌండ్లో స్వర్గీయ పి.ఇంద్రారెడ్డి మెమోరియల్ 69వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ చాంపియన్ షిప్ మెన్, ఉమెన్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, ఎగ్గె మల్లేశం, సీపీ మహేశ్ భగవత్తో కలిసి మంత్రులు జ్యోతిప్రజ్వలన చేసి శాంతి పావురాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, క్రీడలు, క్రీడాకారులకు తెలంగాణ నిలయంగా మారుతున్నదని, దేశ, విదేశీ స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ర్టానికి పేరు తీసుకువస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ, మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఉద్యోగాలలో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.
సీపీఎన్ఆర్ షౌండేషన్, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ వింగ్, మేయర్, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాతనర్సింహరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పి.కార్తీక్ రెడ్డి, తీగల విక్రంరెడ్డి, కబడ్డీ అసోసియేషన్ నాయకులు జగదీశ్ యాదవ్, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, రాళ్లగూడెం సంతోషిశ్రీనివాస్రెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి, పెద్దబావి శోభాఆనంద్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కవితారాంరెడ్డి, స్వప్న వెంకట్రెడ్డి, భీమిడి స్వప్నజంగారెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు.