ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర సర్కారు హరితహారానికి శ్రీకారం చుట్టింది. ఏటా లక్షలాది మొక్కలు నాటుతూ అడవుల శాతాన్ని పెంచుతున్నది. అయితే ప్రతి సీజన్లో మొక్కలు కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. అది కూడా ముందస్తుగా సమాచారం ఇస్తే గానీ దొరక్కపోయేవి. ఫలితంగా లక్ష్యం నెరవేరకపోయేది. ఇలాంటి పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర సర్కారు దూరదృష్టితో పల్లె, పట్టణాల్లో నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ప్రత్యేక నిధులతో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ఆయా పంచాయతీ, పట్టణం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుతున్నారు.
కోరుట్ల, జూలై 18 : హరితహారం కింద మొక్కలు నాటాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాల్సి వచ్చేది. ముందస్తుగానే సమాచారం ఇచ్చి సమకూర్చుకునేది. అయినా, లక్ష్యానికి మించి దొరకని పరిస్థితి ఉండేది. అవి కూడా ఎంతో వ్యయ ప్రయాసలు పడితే చేతికిరాకపోయేది. ఇలా కార్యక్రమ ప్రారంభంలో అధికార యంత్రాంగం ఎంతో ఇబ్బందులు పడ్డది. కానీ ఇలాంటి బాధలు లేకుండా.. ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేకుండా.. పల్లె, పట్టణాల్లో సర్కారు నర్సరీలు ఏర్పాటు చేయిస్తున్నది. తీరొక్క మొక్కలతో హరితహారం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుతున్నది. ఇందుకు కోరుట్ల పట్టణంలోని నర్సరీనే నిదర్శనంగా నిలుస్తున్నది. ఎనిమిదో విడత కోసం 30 రకాలతో 2.60 లక్షల మొక్కలను బల్దియా సిద్ధం చేసింది. త్వరలోనే నాటేందుకు ప్రణాళికలు కూడా పూర్తి చేసింది.
కోరుట్ల నర్సరీ రెడీ
హరితహారానికి మొక్కల కొరత లేకుండా బల్దియా అధికారులు పట్టణ ప్రగతి నిధులతో అయ్యప్ప గుట్ట వద్ద ఎకరన్నర స్థల విస్తీర్ణంలో రూ. 30 లక్షలు వెచ్చించి ప్రత్యేక నర్సరీని నెలకొల్పారు. ఇందులో 2.60 లక్షల మొక్కలను పెంచుతున్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నర్సరీ చుట్టూ ప్రత్యేక గోడను నిర్మించి గేట్ను ఏర్పాటు చేశారు. నిత్యం మొక్కలకు నీరందించేందుకు బోరు బావిని తవ్వించి, మొక్కలకు ఎండ బారి నుంచి రక్షణ కోసం షేడ్ నెట్లను అమర్చి కంటిరెప్పలా రెప్పలా మొక్కలను సంరక్షిస్తున్నారు. మొక్కలు చిన్నగా ఉండి నాటే సమయంలో చనిపోయే ప్రమాదం ఉందని విత్తనాలు మొలకెత్తే దశలోకి వచ్చిన తర్వాత మరింత రక్షణ కోసం పాలిథీన్ కవర్లలోకి మార్చి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మొక్కల సత్వర ఎదుగుదలకు కావాల్సిన నాణ్యమైన మట్టి, ఎరువుల మిశ్రమాన్ని కలిపి విత్తనాలను నాటించడం మొదలు పెట్టారు. దీంతో నర్సరీ పచ్చదనం పరుచుకొని చిట్టడవిని తలపిస్తున్నది. ఎనిమిదో విడుత ప్రారంభంకాగానే పట్టణంలోని ప్రభుత్వ భూములు, రహదారులకు ఇరువైపులా, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల పరిసరాలు, ఇళ్ల ఆవరణలో, ప్రార్థన మందిరాలు, ఆలయ ప్రాంగణాలు, పోలీస్స్టేషన్, రెవెన్యూ, రైల్వేస్టేషన్ పరిసరాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నిరుపయోగంగా వున్న ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటించి ఎలాగైనా పట్టణాన్ని పచ్చదనంతో నింపాలనే పట్టుదలతో మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తున్నది
విరివిగా మొక్కలు..
హరిత లక్ష్యం వంద శాతం చేరుకునేందుకు మొక్కలను అందుబాటులో ఉంచారు. స్థానికంగా 2.50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు నర్సరీల్లో ఇప్పటికే 50 వేల చొప్పున మొక్కలను సిద్ధంగా ఉంచారు. ప్రజలకు పంపిణీ చేసేందుకు మూడు నర్సరీల్లో పూలు, పండ్లు, నీడనిచ్చే సుమారు 30 రకాల మొక్కలు జామ, అల్లనేరేడు, చక్ర మల్లె, మందారం, నేరేడు, మల్లె, చామంతి, కోనా కార్పస్, వాటర్ ఆపిల్, గన్నేరు, నూరు వరహాలు, మైదాకు, గులాబీ, గుల్మోహర్, పెల్టో ఫోరం, దానిమ్మ, కానుగ, పారిజాతం, టెకోమా, శ్రీగంధం, నెమలి నార, వేప, టేకు, కదంబా, నిద్ర గన్నేరు, బాదాం, బోహమియా, స్పతోడియా, చింత, సీతాఫలం, నరేఫా, సిల్వియా వంటి మొక్కలను పంపకానికి సిద్ధంగా ఉంచారు.
ఆకుపచ్చని పట్టణంగా మార్చడమే లక్ష్యం..
మొక్కల కొనుగోలుకు గతంలో లక్షల్లో నిధులు వెచ్చించాల్సి వచ్చేది. కానీ స్థానికంగానే నర్సరీ ఏర్పాటుతో నిధులు ఆదా కావడంతో పాటు నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. కోరుట్ల పట్టణాన్ని హరితమయం చేయడమే లక్ష్యంగా ఎనిమిదో విడుతలో 2.50 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించాం. స్థానికంగా ఉన్న యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం.
– మహ్మద్ ఆయాజ్, మున్సిపల్ కమిషనర్ (కోరుట్ల)