హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాలనలో ప్రణాళిక, అర్థగణాంక శాఖలు కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఇవి ఇతర శాఖలకు దిక్సూచిగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని వివరిస్తూ అర్థగణాంక, ప్రణాళిక శాఖలు ముద్రించిన ‘తెలంగాణ జర్నీ’, ‘స్టేట్ ఎకానమీ’, ‘తెలంగాణ ఎకానమీ’ ప్రచురణలను వినోద్కుమార్ బుధవారం ఆవిషరించారు. అనంతరం స్వయంగా లేఖలు రాసి ఈ మూడు ప్రచురణలను రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర అధికారులకు పంపారు. ఇవి అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. జిల్లా గ్రంథాలయాలు, యూనివర్సిటీ లైబ్రరీల్లోనూ వీటిని అందుబాటులోకి తేనున్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ శాఖల పురోగతి, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలను రూపొందించడంలో ప్రణాళిక, అర్థగణాంక శాఖలు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ప్రశంసించారు. గత ఏడేండ్లలో రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఈ మూడు ప్రచురణల్లో కండ్లకు కట్టినట్టు వివరించారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రగతి, జీఎస్డీపీ, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల తదితర రంగాల్లో సాధించిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారని కొనియాడారు. ఈ మూడు ప్రచురణలు రాష్ట్ర ముఖచిత్రాన్ని వివరించే కరదీపికలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సూక్ష్మ పరిశీలన, లోతైన విశ్లేషణ చేసేందుకు ఎప్పటికప్పుడు ఈ శాఖల అధికారులకు సూచనలు, సలహాలను ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో అర్థగణాంక శాఖ సంచాలకుడు జీ దయానంద్, సహాయ సంచాలకుడు కేవీ ప్రసాద్రావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి తదితరులు పాల్గొన్నారు.