హైదరాబాద్ : సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎంకు వివిధ పార్టీల నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని వినతి చేశారు. కాజీపేటలో వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జీఎంను కలిసిన అనంతరం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నేతలు సహకరించాలి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విభజన చట్టంలో ఉందన్నారు. కోచ్ ఫ్యాక్టరీకి గతంలోనే భూసేకరణ, నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. భూసేకరణ జరిగినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేబినెట్ భేటీలో నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై పార్లమెంట్లో ప్రకటన చేయాలన్నారు. ప్రకటన చేయకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కోచ్ ఫ్యాక్టరీ విషయమై మోదీని పలుసార్లు కలిసి సీఎం కేసీఆర్ అడిగారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. మోదీ సర్కార్ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల్లో అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్ను కేంద్రం విస్మరించడం దారుణమన్నారు. రైల్వే ప్రయివేటీకరణతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగ అవకాశాల్లో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. రేపటి బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని వినోద్ కుమార్ కోరారు.