న్యూఢిల్లీ : కేంద్ర టెక్స్టైల్ మంత్రిగా పీయూష్ గోయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన స్మృతి ఇరానీ ఆయనకు బాధ్యతలు అప్పగించి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త మంత్రిత్వ శాఖ కేటాయించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ తన పదవీకాలంలో మంత్రిత్వశాఖ చాలా మంచి పనులు చేశారంటూ ప్రశంసించారు. టెక్స్టైల్ రంగం బలంగా ఉండాలని, ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతుగా ఉండాలని ప్రధాని కోరుకుంటున్నారని గోయల్ పేర్కొన్నారు.
టెక్స్టైల్స్ పెద్ద ఉపాధి రంగమని, దీని ద్వారా ఈ రంగంలో పనిచేసే వారందరికీ, ముఖ్యంగా మహిళల ఆదాయం కోసం మరింత సహకారం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. టెక్స్టైల్ రంగాన్ని మరింత మెరుగుపరిచి, ఎగుమతులు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఇంతకు ముందు బ్రాండ్ ఇండియాను నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన భారతీయ వస్త్రాలు మళ్లీ కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్స్టైల్ మంత్రిత్వశాఖ సహాయ మంత్రిగా దర్శన్ విక్రమ్ జర్దోష్ బాధ్యతలు స్వీకరించారు. పీయూష్ గోయల్ మార్గదర్శనంలో వస్త్రరంగం అభివృద్ధికి పాటుపడుతానన్నారు.