ముంబై : కరోనా మహమ్మారి వెంటాడినా ఈ ఏడాది రికార్డుస్ధాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తరలివచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత్లో సానుకూల వాణిజ్య వాతావరణం ఉందని, పెట్టుబడులకు మెరుగైన గమ్యస్ధానంగా ముందుకొచ్చిందని అన్నారు. ఓ జాతీయ చానెల్ ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ రాబోయే నెలల్లో డిజిటల్ సేవల్లో భారీ వృద్ధిని చూడబోతున్నామని, మన విదేశీ మారకద్రవ్య నిధులు ఆల్టైమ్ హైకి చేరాయని చెప్పుకొచ్చారు.
పీఎస్యూల ప్రైవేకరణను ప్రస్తావిస్తూ ప్రభుత్వ రంగ కంపెనీలతో పాటు నిర్ధిష్ట రంగాల్లో నిర్వహణ సామర్ధ్యం పెంపునకు పెట్టుబడుల ఉపసంహరణ కీలకమని వ్యాఖ్యానించారు. బ్యాంకుల జాతీయీకరణ ఆవశ్యకత నెలకొన్న రోజుల్లో ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుత పరిస్ధితుల్లో కొన్ని పీఎస్యూల ప్రైవేటీకరణ అవసరమని, ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.