నిజామాబాద్: ఇందూరు నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బీహార్లో ప్రమాదానికి గురైంది. బీహార్లోని ఔరంగాబాద్ (Aurangabad) జిల్లాలో బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బోల్తా పడి నిజామాబాద్ జిల్లా వెల్మల్కు చెందిన వృద్ధురాలు మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులకు ఔరంగాబాద్లోని దవాఖానకు తరలించారు.
మంగళవారం 38 మంది యాత్రికులతో నిజామాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సు కాశీ యాత్రకు బయలుదేరింది. అయితే బీహార్లోని ఔరంగాబాద్లో ఓ హోటల్ వద్ద బస్సు ఆపుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. దీంతో సరలమ్మ (70) అనే వృద్ధురాలు మరణించారని పోలీసులు తెలిపారు. బస్సులో వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్తో పాటు బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారని వెల్లడించారు.