బీజేపీ కుట్రలను ఎండగడుతాం
పిడమర్తి రవి, గజ్జెల కాంతం
ఖైరతాబాద్, ఏప్రిల్ 1: కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి రిజర్వేషన్లు ఎత్తి వేసే కుట్ర పన్నుతున్నదని, దేశ ప్రజలపై ఆ పార్టీ చేస్తున్న కుట్రను ఎండగడుతామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నదని మండిపడ్డారు. ఈ నెల 28న రవీంద్రభారతిలో నిర్వహించే రాజ్యాంగ రక్షణ సదస్సు కరపత్రాలను గురువారం హైదరాబాద్ లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్ట్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ను సైతం ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తున్నదని, అలా చేస్తే 3 లక్షలకు పైగా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రిజర్వేషన్లకు తూట్లు పొడిచే బీజేపీకి భవిష్యత్లో ఓట్లు వేయవద్దని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ను ఎక్కడికి వెళ్లినా అడ్డుకొంటామని హెచ్చరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న ట్యాంక్బండ్ వద్దగల బాబు జగ్జీవన్రాం విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నీలి కవాతు నిర్వహిస్తున్నామని, ఈ నెల 28న జరిగే భారత రాజ్యాంగ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ సురేందర్ సన్నీ, భాస్కర్, నరసయ్య, సంపత్, వెంకటేశ్, సాయి పాల్గొన్నారు.