శివపురి, డిసెంబర్ 22: తమ బిడ్డలకు సంబంధించిన ప్రతి సందర్భాన్ని తల్లిదండ్రులు వేడుకగా జరుపుకొంటారు. బారసాల, పుట్టినరోజు వంటి వేడుకలు కామన్. కానీ, ఐదేండ్ల బిడ్డకు స్మార్ట్ఫోన్ కొనిచ్చి ఓ తండ్రి భారీ ఊరేగింపు నిర్వహించాడు. మధ్యప్రదేశ్లో ఓ చాయ్వాలా తన బిడ్డపై ఉన్న ప్రేమను ఇలా వినూత్నంగా చాటుకున్నాడు. శివపురి పట్టణంలోని మురారీ కుష్వాహా చాయ్కొట్టు నిర్వహిస్తున్నాడు. ఐదేండ్ల కుమార్తె ముచ్చట తీర్చేందుకు రూ.12 వేలతో స్మార్ట్ఫోన్ కొన్నాడు. షోరూం నుంచి ఇంటి వరకు పెండ్లి బరాత్ను తలపించేలా ఊరేగింపుగా తీసుకెళ్లాడు. గుర్రపుబండిని లైట్లతో అలంకరించి, బిడ్డతోపాటు తోబుట్టువులను అందులో కూర్చోబెట్టి స్మార్ట్ఫోన్ ప్రదర్శిస్తూ.. డ్యాన్సులు చేస్తూ ఊరేగింపు నిర్వహించాడు.