హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పీహెచ్సీలపై పర్యవేక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 729 కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలకు పది రోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఆన్లైన్లోకి తీసుకురావాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు ఆదేశించారు. నెలవారీ సమీక్షలో భాగంగా సోమవారం పీహెచ్సీలు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల పనితీరుపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశలు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ డాక్టర్లు వైద్యరంగానికి మూలస్తంభాలని అభివర్ణించారు. ప్రాథమిక దశలోనే రోగాలను గుర్తించి అవసరమైన వైద్యం అందిస్తే రోగి ఆరోగ్యాన్ని, డబ్బును కాపాడవచ్చన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీల సంఖ్య మరింత పెరగాలని, ముఖ్యంగా నార్మల్ డెలివరీల సంఖ్య పెరగాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లా ఖాజిపల్లి సబ్సెంటర్లో వంద శాతం ఏఎన్సీ, ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు నమోదయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ఏఎన్ఎం, ఆశ, ఇతర వైద్యసిబ్బందిని ప్రశంసించారు. మెదక్, ములుగు జిల్లాల్లో 80 శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని అభినందించారు.
ప్రభుత్వం ఎంసీహెచ్లను స్థాపించి, ఆధునిక వైద్య సదుపాయాలను కల్పిస్తున్నదని, వంద శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో 9 జిల్లాల్లో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషిన్ కిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 18 నెలల మిడ్ వైఫరీ శిక్షణ పూర్తిచేసుకున్న 133 మంది నర్సులకు త్వరలో పోస్టింగ్ ఇస్తామన్నారు. డెలివరీ రోజే కేసీఆర్ కిట్ ఇవ్వాలని స్పష్టం చేశారు.
పీహెచ్సీల్లోని లేబర్ రూంను సరిగా స్టెరిలైజేషన్ చేయాలన్నారు. పిల్లలకు ఇమ్యూనైజేషన్ క్యాలెండర్ ప్రకారం క్రమం తప్పకుండా టీకాలు, వ్యాక్సిన్లు అందేలా చూడాలని కోరారు. ఈ దఫా రాష్ట్రంలో వర్షాలు బాగా కురిశాయని, దోమలు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల్లో డెంగీ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయాలన్నారు.
పాము కాటు, తేలు కాటు, కుక కాటు మందులు అందుబాటులో ఉండాలని, ఏ సమయంలోనైనా సేవలు అందించాలని సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తుల సమాచారం అన్లైన్లో పొందుపరిచి నగదుసాయం, పోషకాహార కిట్స్ అందేలా చూడాలన్నారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.