హైదరాబాద్ : నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. రిజర్వాయర్లో దిగి ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు గల్లంతయ్యారు. ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఫార్మసీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు శనివారం ఉదయం నాగార్జున సాగర్కు పిక్నిక్ కోసం వచ్చారు. మధ్యాహ్నం వరకు స్నేహితులంతా ఉత్సాహంగా గడిపి.. హైదరాబాద్కు బయలుదేరారు. అక్కపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్దకు వచ్చారు. సరదాగా ఈతకొట్టేందుకు రిజర్వాయర్లోకి దిగారు.
ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులు ఆకాశ్, కృష్ణ, గణేశ్ అనే విద్యార్థులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపుచేపట్టారు. ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యమవగా.. మరో విద్యార్థి ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతం విద్యార్థి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కండ్ల ఎదుటే విద్యార్థులు నీటిలో మునిగిపోవడంతో.. తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.