హయత్నగర్, సెప్టెంబర్ 11: హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మాసిస్టు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లికి చెందిన జింకల పాండు(33) భార్యా పిల్లలతో కలిసి కుంట్లూరులో నివాసముంటున్నాడు. అతడు ఆటోనగర్లోని శ్రీరాజరాజేశ్వరి మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు.
ఆదివారం మధ్యాహ్నం ఆటోనగర్ నుంచి అతడు తన మోటారు సైకిల్పై కుంట్లూరుకు బయలుదేరాడు. ఇండియన్ ఫార్మాసీకి ఎదురుగా విజయవాడ జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ నిరక్ష్యంతో ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా అకస్మాత్తుగా తిప్పాడు. అదే సమయంలో వెనుక నుంచి బైక్పై వస్తున్న పాండు వేగంతో ఆ లారీని ఢీకొని కిందపడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.