వాషింగ్టన్: వ్యాక్సిన్ తయారుచేయడానికి ఉపయోగించే ముడిసరుకుల ఎగుమతిపై తాత్కాలికంగా అమెరికా నిషేధం విధించడాన్ని భారత్ ఔషధ సంస్థలు తప్పుబట్టాయి. ప్రపంచ దేశాలకు అవసరమైన కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడతాయని పేర్కొన్నాయి. తక్షణం ఈ అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డాయి. అమెరికా.. తమ దేశీయ సంస్థల ప్రయోజనాల కోసమే ఈ నిషేధం విధించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యాక్సిన్ల తయారీలో కీలక ముడి పదార్థాలపై అమెరికా విధించిన తాత్కాలిక నిషేధం.. టీకాలకు అవసరమైన బ్యాగులు, ఫిల్టర్లు ఇతర వస్తు సామగ్రి కొరత ఏర్పడుతుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా పేర్కొన్నారు. భారీగా నోవాక్సిన్ తయారు చేయాలని నిర్ణయించినా అమెరికా తాత్కాలిక నిషేధం ఆటంకంగా మారుతుందన్నారు. అమెరికా సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్టును ఆ దేశ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిందన్నారు. ఫలితంగా ప్రపంచ దేశాలకు సమంగా వ్యాక్సిన్ సరఫరా చేయడానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ సైతం అమెరికా నిర్ణయం సరి కాదన్నారు. ప్రస్తుత కీలక సమయంలో వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ దేశాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్ల తయారీకి కీలకమైన ముడి సరుకుల ఎగుమతిపై ఆంక్షలు విధించడం వల్ల లక్ష్యాన్ని చేరుకోలేమని అభిప్రాయ పడ్డారు. అమెరికాలో భారీగా పంపిణీ చేస్తున్న ఫైజర్ టీకా కోసమే ఆ దేశ ప్రభుత్వం వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి సరుకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించినట్లు సమాచారం.