న్యూఢిల్లీ: కోవిడ్-19 టీకాల దిగ్గజం ఫైజర్ భారత్కు పెద్దఎత్తున సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంది. భారత్లో ఉధృతంగా కనిపిస్తున్న వైరస్ రకంపై తమ టీకా చక్కగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. కాకపోతే భారత ప్రభుత్వం ఓ చిన్నపని చేయాలని డిమాండ్ చేస్తున్నది. టీకాల వల్ల ఏవైనా నష్టాలు కలిగితే చట్టపరమైన చర్యలు లేకుండా చూడాలని కంపెనీ గట్టి పట్టు మీద ఉన్నది. దీనిని ఇండెమ్నిటీ క్లాజ్ అంటారు. తాను టీకాలు సరఫరా చేస్తున్న అన్ని దేశాల నుంచి ఇలాంటి హామీనే ఫైజర్ రాబట్టుకుంది. ఫైజర్ ఇప్పటిదాకా ఎలాంటి పరీక్షల్లో నిలదొక్కుకోని మైటోకాండ్రియల్ ఆర్ఎన్ఏ పద్ధతిలో కోవిడ్ టీకాను తయారు చేస్తున్నది. దీనిని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నెలరోజుల వరకు కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేయవచ్చు. భారత్లో సెకండ్వేవ్లో ఎక్కువగా కనిపిస్తున్న వైరస్పై తమ టీకా ప్రభావం చూపుతుందని నొక్కిచెప్తున్నది. 12 సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరికైనా ఈ టీకా బ్రహ్మాండంగా పనిచేస్తుందని అంటున్నది. ఆ సంగతి ప్రయోగాల్లో రుజువైందట. నియంత్రణల నుండి మినహాయింపు ఇస్తే జూలై-అక్టోబర్ మాసాల మధ్య 5 కోట్ల డోసులను వేగంగా సరఫరా చేసేందుకు సిద్ధమని అంటున్నది. కాకపోతే పరిహారాల చెల్లింపు నుంచి మినహాయింపు తప్పనిసరిగా కావాలని డిమాండ్ చేస్తున్నది. భారత్ లో ప్రస్తుతం అనుమతి పొందిన కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వీ టీకాల్లో దేనికీ ఇలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ప్రస్తుతం ఫైజర్ టీకాలు సరఫరా చేస్తున్న అమెరికా, యూరప్ దేశాలు పరిహార మినహాయింపు ఇచ్చాయి. భారత ప్రభుత్వం ఫైజర్ ప్రతిపాదనల పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి.