న్యూఢిల్లీ: పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అధికారిక ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర ప్రభుత్వం ఐదేండ్లపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతోపాటు పాపులర్ ఫ్రంట్కు సంబంధించిన వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని సంబంధిత సంస్థలను కేంద్ర హోంఖ ఆదేశించింది. దీంతో పీఎఫ్ఐ అధికారిక అకౌంట్ను ట్విట్టర్ నిలిపివేసింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్ఐని బ్యాన్ చేస్తున్నట్టు హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపా చట్టం కింద పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు రెహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆలిండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ వుమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ రెహాబ్ కేరళ ఫౌండేషన్పై నిషేధం విధిస్తున్నామని పేర్కొన్నది.
‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందినవారే పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యులు. వీరికి నిషేధిత జమాత్ ఉల్ ముజాయిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)తో సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు.. ఐఎస్ఐఎస్తోనూ లింకులు ఉన్నాయి. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో అసాంఘిక చర్యలకు పాల్పడేలా చేస్తున్నాయి’అని తెలిపింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు కూడా పీఎఫ్ఐపై నిషేధానికి సిఫారసు చేశాయని గుర్తుచేసింది. కేంద్రం నిర్ణయంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులు సీజ్ కానున్నాయి. బ్యాంక్ అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేస్తారు. కాగా, వారం రోజులుగా పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇండ్లపై ఎన్ఐఏ, రాష్ర్టాల పోలీసు బృందాలు దాడులు నిర్వహించి, వందల మందిని అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే.