కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కేసు సుప్రీంకోర్టుకు చేరుకున్నది. రాష్ట్రంలో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ను ఉల్లంఘించినందున రాష్ట్రంలోని ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు.
బెంగాల్లో ప్రధాని అధికారిక కార్యక్రమంలో మతపరమైన నినాదాలు చేశారనే ఆరోపణతో కేసు నమోదు చేయాలని సీబీఐని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. జై శ్రీ రామ్తోపాటు ఇతర మతపరమైన నినాదాలివ్వడం ద్వారా ప్రజల మధ్య మనస్పర్ధలు వ్యాప్తి చెందుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నాది. ఇది ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం నేరమని ఎంఎల్ శర్మ తన పిటిషన్లో వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించాలనే ఎన్నికల సంఘం నిర్ణయంపై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ప్రశ్నలు సంధించారు. బీజేపీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రకటన చేసిందని మమత ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఫిబ్రవరి 26 న ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో బెంగాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 6 న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్ రెండుమూడు రోజుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నది.