కేవలం పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్కపేరు నచ్చకపోవడంతో ఆ కుక్క యజమానితో ఒక వ్యక్తి గొడవపడ్డాడు. కుక్కపేరు మార్చమని చెప్పినా యజమాని వినకపోవడంతో.. అతను యజమాని భార్యని కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో జరిగింది.
భావనగర్ జిల్లాకు చెందిన సురభాయ్ పక్కింట్లోకి నెలరోజుల క్రితం కొత్తగా భార్యాభర్తలు అద్దెకు దిగారు. ఆ భార్యభర్తలిద్దరిలో మహిళ పేరు నీతాబేన్(35). నీతాబేన్ ఒక కుక్కపిల్లను పెంచుకునేందుకు తీసుకొచ్చింది. దానిపేరు సోనూ అని పెట్టింది. ఒకరోజు పక్కింట్లో ఉండే సురభాయ్ వారితో నీళ్లపైపు విషయమై గొడవపడ్డాడు. ఆ గొడవను పరిష్కరించేందుకు నీతాబేన్ భర్త సురభాయ్ని ఇంటికిపిలిచాడు.
ఇంట్లో కూర్చొని గొడవ పరిష్కరించుకున్నారు. కానీ అక్కడ నీతాబేన్ కొత్తగా పెంచుకుంటున్న కుక్కపిల్లను సోనూ అని పిలవడం సురభాయ్కు నచ్చలేదు. వెంటనే ఆ కుక్కపేరుని మార్చమని ఆ భార్యభర్తలిద్దరికీ చెప్పాడు. కానీ వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. సురభాయ్ మరుసటి రోజు వాళ్లకు మళ్లీ హెచ్చరించాడు. తన భార్య పేరు కూడా సోను అని.. ఇప్పుడు పక్కింట్లో అదే పేరుతో ఒక కుక్క ఉండడం తనకిష్టం లేదని చెప్పాడు. కానీ నీతాబెన్ తన కుక్కని అలాగే పిలుచుకుంటానని చెప్పి వెళ్లిపోయింది. దీంతో సురభాయ్ కోపంతో రగిలిపోయాడు.
నీతాబెన్ భర్త ఇంట్లో లేని సమయంలో సురభాయ్ తన వెంట నలుగురిని తీసుకెళ్లి ఆమెను చితకబాదాడు. నీతాబెన్ ఎలాగోలా తప్పించుకొని వంటింట్లోకి వెళ్లింది. కానీ సురాభాయ్ తన మనుషులతో అక్కడికి వచ్చి పక్కనే డబ్బాలో ఉన్న కిరోసిన్ని ఆమెపై చల్లి నిప్పంటించాడు. ఆ తరువాత సురాభాయ్ తన మనుషులను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో మంటలు చూసి ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో నీతాబెన్ భర్త కూడా వచ్చి మంటలను ఆర్పారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. నీతాబెన్ శరీరం చాలా వరకు కాలిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు నీతాబెన్ వాంగ్మూలం తీసుకొని సురభాయ్ని అరెస్టు చేయడానికి వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది.