ఖమ్మం, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. విభజన చట్టంలో పొందుపరిచి, గత ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాక ఎందుకు అమలు చేయరంటూ మండిపడుతున్నారు. ‘బయ్యారం ఉక్కు-మా హక్కు’ అంటూ నినదిస్తున్నారు.
ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం తీరుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నిరసనల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఖమ్మం పట్టణంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్లో నిరసనలు మిన్నంటాయి.
హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అదాలత్ అమరవీరుల జంక్షన్ వద్ద, హనుమకొండ చౌరస్తా, కాజీపేట చౌరస్తా, ఐనవోలులో టీఆర్ఎస్ శ్రేణులు కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వద్ద ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబాబాద్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మరిపెడ, గార్ల, చిన్నగూడూరు, దంతాలపల్లిలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
బయ్యారంలో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు ఆధ్వర్యంలో మోదీ చిత్రపటాన్ని ఊరేగించి దహనం చేశారు. నర్సింహులపేటలో కిషన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ములుగులో జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ రైల్వే గేట్, రంగశాయిపేట, కాశీబుగ్గ చౌరస్తా, 33వ డివిజన్, పర్వతగిరి చౌరస్తాలో కిషన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశాయి. పోచమ్మ మైదాన్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. వర్ధన్నపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి.