మే నుంచి అన్నిశాఖలతో నిధుల జమ: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారంలో భాగంగా ఏర్పాటుచేసిన హరిత నిధి (గ్రీన్ ఫండ్)లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. హరిత నిధి పురోగతి, ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై అరణ్యభవన్లో శనివారం మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మే నెల నుంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్యవర్గాలు, విద్యార్థులు తమ వంతు విరాళం హరితనిధికి అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇప్పటిదాకా ఆయా శాఖలు తీసుకున్న చర్యలపై శాఖలవారీగా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, మే నెల నుంచి హరితనిధికి నిధులు జమ అయ్యేలా చూడాలని సూచించారు. హరితనిధి ద్వారా మరింత సమర్థంగా పచ్చదనం కార్యక్రమాల అమలు సాధ్యమవుతుందని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.