న్యూఢిల్లీ : దేశంలో మెరుగైన రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం ఆయన హర్యానాలోని సోహ్నాలో ఢిల్లీ – ముంబై ఎక్స్ప్రెస్ వే (డీఎంఈ) పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ వే దగ్గర భూమి ఉన్న రైతులు డెవలపర్లకు విక్రయించొద్దని, బదులుగా వారితో భాగస్వాములై రోడ్డు పక్కనే సౌకర్యాలు నిర్మించాలని సూచించారు. టోల్చార్జీల కారణంగా ప్రయాణ వ్యయం పెరుగుదలపై స్పందించారు.
ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులను తగ్గించడంలో ఎక్స్ప్రెస్వేలు ఎలా సహాయపడుతాయో వివరించారు. ‘మీరు వివాహం కోసం ఎయిర్ కండిషన్డ్ హాలును వినియోగించాలనుకుంటే.. ఇందుకు కోసం మీరు డబ్బులు చెల్లించాలి. లేకపోతే మైదానంలో కూడా చేసుకోవచ్చు’ అన్నారు. ఎక్స్ప్రెస్ వే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, దీంతో ఇంధన ధర తగ్గుతుందని సూచించారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే ప్రయాణ సమయాన్ని 12 గంటలకు తగ్గిస్తుందని, ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకునేందుకు ట్రక్కుకు 48 గంటలు పడుతుందని, అయితే ఎక్స్ప్రెస్ వేలో కేవలం 18 గంటలు సరిపోతుందన్నారు. తద్వారా ఎక్కువ ట్రిప్పులు చేయొచ్చని.. తద్వారా వ్యాపారం పెరుగుతుందన్నారు.