ఖిలావరంగల్, మార్చి 1: అప్పనంగా వస్తే ఇట్టే జేబులో వేసుకోవచ్చని భావించిన కొందరు ఉన్న చోటే డబ్బు సంపాదిస్తూ కొత్త దందాకు తెరలేపారు. ప్రజల అవసరాలు వాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో అప్పనంగా డబ్బు సంపాదించేందుకు అధికారులు, సిబ్బంది, మరికొందరు బయటి వ్యక్తులు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. నగర శివారు ప్రాంతంలో రవాణా శాఖ సంస్థ ఉండడంతో అక్కడ దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతున్నది. నాలుగు నంబర్లు రాస్తే చాలు.. అందినకాడికి దండుకోవచ్చనేది వారి ఉద్దేశం. అందుకే ఇక్కడ పెన్సిల్ ప్రింట్ దందా మూడు పూలు.. ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నది. ఆర్టీఏ కార్యాలయంలో పెన్సిల్ ప్రింట్ తీసిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సిందే.. లేకుంటే వారిని భయాందోళనకు గురి చేసి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారు. వాహన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన వ్యక్తి ముందుగా నిర్దేశించిన కౌంటర్లో జీరో కౌంటర్ వేసుకొని ఫొటో దిగాలి. అక్కడి నుంచి సంబంధిత ధ్రువపత్రాలతోపాటు వాహనాన్ని ఏఎంవీఐ లేదా ఎంవీఐ వద్దకు తీసుకెళ్లాలి. ఇక్కడ వాహనాన్ని తనిఖీ చేసే ముందు రవాణా శాఖ సిబ్బంది చాసెస్ నంబర్ను పెన్సిల్ ఫ్రింట్ తీయాల్సి ఉంటుంది. పెన్సిల్ ప్రింట్ ఉంటేనే రిజస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. కానీ, రవాణా శాఖ కార్యాలయంలో సిబ్బంది పెన్సిల్ ప్రింట్ తీయకుండా ప్రత్యేకంగా ఐదుగురు బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరితోనే ద్విచక్ర వాహనాలు, కార్లకు రూ. 50 నుంచి రూ. 200 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెన్సిల్ ప్రింట్ తీసిన తర్వాత అడిగిన డబ్బులు ఇవ్వకపోతే వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వాహనదారులు వాపోతున్నారు. ‘మీ ఏజెంటు ఎవరు, ఆయన ఫోన్ నంబర్ ఇవ్వు.. లేకుంటే నీ వాహన రిజిస్ట్రేషన్ మధ్యలోనే ఆగిపోతుంది’ అని బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. గత్యంతరం లేక డబ్బులు ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ. 50 లేదా రూ. 100 వసూలు చేస్తూ నెలకు రూ. లక్షల్లో దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెన్సిల్ ప్రింట్ దందా కార్యాలయ ప్రాంగణంలోనే జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రింట్ తీసే వ్యక్తులు బ్రోకర్ల మాదిరిగా కాకుండా రవాణా శాఖ అధికారులు, సిబ్బందిగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వాహన యజమానుల నుంచి వసూలు చేస్తున్న మామూళ్లు నెలకు రూ. లక్షల్లో ఉంటుందంటే అతిశయోక్తికాదు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెన్సిల్ ప్రింట్ పేరుతో అక్రమ వసూళ్లను ఆపాలని వాహనదారులు కోరుతున్నారు.